Connect with us

Telangana

ఆడ ‘తోడు’ కోసం ‘టైగర్ జానీ’ నిరంతరం ప్రయాణం.. మహారాష్ట్ర నుంచి తెలంగాణ వరకు 340 కి.మీ ప్రేమయాత్ర..!

ఆడ ‘తోడు’ కోసం ‘టైగర్ జానీ’ నిరంతరం ప్రయాణం.. మహారాష్ట్ర నుంచి తెలంగాణ వరకు 340 కి.మీ ప్రేమయాత్ర..!

ఆడ పులి కోసం వెతుకుతున్న ఒక మగ పులి మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చింది. తన తోడును వెతుకుతూ దాదాపు 340 కి.మీ ప్రయాణించింది. ఆసిఫాబాద్ జిల్లాలో స్థానికులను భయపెట్టిస్తున్న ఈ పులి మహారాష్ట్రలోని కిన్వాట్ అడవుల నుంచి వచ్చినట్లు అటవీ అధికారులు తెలిపారు. ఆడ తోడు కోసం ఆసిఫాబాద్ చేరుకున్న ఈ పులి, దాని తోడు ఇంకా 20 కి.మీ దూరంలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ప్రేమ, విరహం మనుషులకే కాదు జంతువులకూ ఉంటుంది. అందుకు మంచి ఉదాహరణ టైగర్ జానీ అనే పెద్ద పులి. ఆడ తోడు కోసం ఈ పులి నిరంతరం ప్రయాణం చేస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, నెల రోజులుగా నడుస్తూనే ఉంది. ఇప్పటికే 340 కి.మీ దాటి, ప్రేమయాత్ర ఇంకా కొనసాగుతోంది. మహారాష్ట్ర అడవుల నుంచి కొండలు, గుట్టలు దాటిన తరువాత తెలంగాణ కవ్వాల్ అటవీ కేంద్రానికి చేరుకుంది.

నిర్మల్ జిల్లా సమీపంలోని మహబూబా ఘాట్ వద్ద ఈనెల 11న ఓ పులి రోడ్డు దాటుతుండగా వాహనదారుల కంటపడింది. ఆ పులిని టైగర్ జానీ అనే మగ పులిగా పిలిచారు. 6-8 ఏళ్ల వయస్సున్న ఈ టైగర్ జానీ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వాట్ అడవుల నుంచి ఆదిలాబాద్ అడవుల దిశగా వచ్చింది. కిన్వాట్, భైంసా, కుంటాల, సారంగాపూర్, ఇచ్చోడ మీదుగా ప్రయాణించి ప్రస్తుతం ఉట్నూరుకు చేరుకుంది. దాదాపు 340 కి.మీ ఈ పులి సంచారం చేసింది.

ఆ పులి తెలంగాణకు రావడానికి ప్రధాన కారణం ఆడ తోడును వెతకడమేనని అటవీ అధికారులు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ తెలిపిన ప్రకారం, ఆడ తోడును వెతకడం కోసం టైగర్ జానీ తన ప్రయాణాన్ని ప్రారంభించాడని చెప్పారు. చలికాలంలో మగ పులులు తరచుగా ఇలాంటి సుదీర్ఘ ప్రయాణాలు చేస్తారని చెప్పారు. ఇది పులుల సంభోగ కాలమని, తమ ప్రాంతంలో సరైన జత దొరకకపోతే ఆడ పులిని వెతుకుతూ పులులు ఇలాగే దీర్ఘ ప్రయాణాలు చేస్తాయని తెలిపారు.

టైగర్ జానీ అక్టోబర్ మూడో వారంలో తన ప్రయాణం ప్రారంభించి ఉండవచ్చని బాజీరావు చెప్పారు. ఇది మొదట ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ మండల అడవుల్లో కనిపించింది. ఆ తర్వాత, నిర్మల్‌ జిల్లా కుంటాల, సారంగాపూర్‌, మామడ, పెంబి మండలాల మీదుగా ఉట్నూర్‌లోకి చేరుకుంది. హైదరాబాద్-నాగ్‌పూర్ నేషనల్ హైవే-44 దాటి, తిర్యాణి ప్రాంతం వైపు వెళ్లిందని తెలిపారు.

Advertisement

ఆడ పులులు విడుదల చేసే ప్రత్యేక సువాసనను మగ పులులు 100 కి.మీ దూరం నుంచే పసిగడతాయని, అందుకే ఆడ తోడును వెతుక్కుంటూ ఎంత దూరమైనా ప్రయాణిస్తాయని బాజీరావు తెలిపారు. ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్-కెరమెరి అడవుల్లో ఒంటరిగా ఉన్న ఆడ పులికి కేవలం 20 కి.మీ దూరంలోనే టైగర్ జానీ ఉందన్నారు. ఆడ పులి మూత్రం నుంచి వచ్చే సువాసనను అనుసరిస్తూ, టైగర్ జానీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని చెప్పారు. త్వరలోనే ఆడ పులిని చేరుకుని సంభోగం చేస్తుందని తెలిపారు. అయితే ఈ సంభోగం ఆడ, మగ పులుల పరస్పర అంగీకారం, దట్టమైన అడవి వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు.

టైగర్ జానీ ఇప్పటివరకు ఐదు పశువులను చంపేసిందని ఫారెస్ట్ అధికారి బాజీరావు చెప్పారు. పులులు ఆడ తోడును వెతకడంలో మనుషులకు ఎలాంటి ముప్పు ఉండదని ఆయన తెలిపారు. పులి విషయంలో భయాందోళనలు అవసరం లేదని అన్నారు. ప్రస్తుతం అది కవాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌కు చేరుకుంటుందని, అక్కడే ఉంటే ఫారెస్ట్‌లో పులుల సంఖ్య పెరిగి, జీవ వైవిధ్యం కూడా పెరుగుతుందని చెప్పారు. టైగర్ జానీ కదలికలు పసిగట్టేందుకు ట్రాప్‌ కెమెరాలను ఉపయోగిస్తున్నామన్నారు. టైగర్ జానీ మూలాలను కనుగొనడానికి మహారాష్ట్ర అటవీ అధికారులను సంప్రదిస్తామని బాజీరావు చెప్పారు.

Loading

Trending