Connect with us

Telangana

పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. 31 రైళ్లు రద్దు..

పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ సమీపంలో ట్రైన్ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. 11 బోగీలు పట్టాలు తప్పడంతో మూడు రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. ఓవర్ లోడ్ కారణంగా మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ట్రైన్ కర్ణాటకలోని బళ్లారి నుంచి యూపీలోని ఘజియాబాద్‌కు వెళ్తోంది. 44 బోగీలతో ఈ గూడ్స్‌ ట్రైన్ వెళ్తుండగా.. అధిక లోడు వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. వేగంగా వెళ్తున్న రైలు బోగీల మధ్య ఉన్న లింక్‌లు తెగిపోవడంతోపాటు ఒకదానిపై మరో బోగి పడి మూడు ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించారు.

ఇక గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడంతో ఢిల్లీ-చెన్నై మార్గంలో కొన్ని ట్రైన్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పెద్దపల్లి-రామగుండం వైపు వెళ్లే ట్రైన్ల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. ట్రైన్ పట్టాలు తప్పిన విషయం గురించి తెలియగానే.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.. దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. పెద్దపల్లి- రామగుండం మార్గంలోని ట్రైన్ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. వెనువెంటనే రైల్వే ట్రాక్‌ను పునరుద్దరించాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులను ఆదేశించారు. రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనులు వేగంగా సాగుతున్నాయని.. త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

ఇక గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడంతో పలు ట్రైన్లను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు రద్దు చేశారు. ఏకంగా 31 ట్రైన్లు పూర్తిగా రద్దు చేయటంతో పాటు.. మరో 10కి పైగా ట్రైన్లను ప్రస్తుతానికి రద్దు చేసినట్లు చెప్పారు. హైదరాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, సికింద్రాబాద్‌-కాగజ్‌నగర్‌, నర్సాపూర్‌-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-నాగ్‌పుర్‌, కాజీపేట-సిర్పూర్‌ టౌన్‌, సిర్పూర్‌ టౌన్‌-కరీంనగర్‌, కరీంనగర్‌-బోధన్‌, బల్లార్షా-కాజీపేట, యశ్వంత్‌పూర్‌-ముజఫర్‌పూర్‌, సిర్పూర్‌ టౌన్‌-భద్రాచలం రోడ్‌, భద్రాచలం రోడ్‌-బల్లార్షా, కాచిగూడ-నాగర్‌సోల్, కాచిగూడ-కరీంనగర్‌, ఆదిలాబాద్‌-పర్లి, అకోలా-పూర్ణ, ఆదిలాబాద్‌-నాందేడ్‌, సికింద్రాబాద్‌-రామేశ్వరం, సికింద్రాబాద్‌-తిరుపతి, గుంతకల్లు-బోధన్‌, నిజామాబాద్‌-కాచిగూడ ట్రైన్లను రద్దు చేశారు. రైల్వే ట్రాక్ పునరుద్దరణ తర్వాత ట్రైన్లు యథావిథిగా నడుస్తాయని చెప్పారు.

Loading

Trending