Connect with us

Latest Updates

బెంగళూరులో భారీ వర్షం.. ఈ వర్షాల వల్ల 7 మంది మృతి.. మరో 4 రోజులు కొనసాగుతుంది..

దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరాన్న వరుణుడు వణికిస్తున్నాడు. సోమవారం నుంచి అకస్మాత్తుగా మొదలైన భారీ వర్షాలతో ప్రజల జీవనం నిలిచిపోయింది. వరద తాకిడికి యలహంక కేంద్రీయ విహార్‌ ఆవరణలో అలారం వ్యవస్థ ఉన్న కార్లన్నీ ఒక్కసారిగా మోగడం ప్రారంభించాయి. కింది అంతస్తుల్లో ఉన్నవారు అప్రమత్తమయ్యేలోపే వరద చుట్టుముట్టింది. ఆ ప్రాంతంలోని ప్రజలను మంగళవారం ఉదయం నుంచి యుద్ధ ప్రాతిపదికన బయటకు తీసుకొచ్చారు. నగరంలోని కీలక ప్రాంతమైన బాబూసాపాళ్యలో నిర్మాణంలో ఉన్న భవంతి మంగళవారం సాయంత్రం వర్షాల వల్ల ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు, 17 మంది గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు కార్మికులు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. అగ్నిమాపక బృందం మరియు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయ చర్యలు చేస్తున్నారు.

యశ్వంతపురలో సోమవారం సాయంత్రం నీళ్లు తెచ్చేందుకు కెంగేరి చెరువులో దిగిన 11 ఏళ్ల మహాలక్ష్మీ మునిగిపోయింది. ఆమెను గమనించిన 13 ఏళ్ల శ్రీనివాస్, అంటే జాన్సీ, కాపాడేందుకు ప్రయత్నించాడు. కానీ ఇద్దరూ చెరువులో మునిగి మృతి చెందారు. రెస్క్యూ సిబ్బంది బాలుడి మృతదేహాన్ని వెలికితీసి, బాలిక మృతదేహం కోసం గాలిస్తున్నారు.

భారీవర్షం నేపథ్యంలో నగరంలోని విద్యాసంస్థలకు అధికార యంత్రాంగం బుధవారం సెలవు ప్రకటించింది. బెంగళూరులో ఔటర్ రింగ్ రోడ్డు, మహదేవపుర, ఇబ్లూరు, మారతహళ్లి మరియు ఇతర ప్రాంతాల్లో సర్వీసు రోడ్లపై బైకులతో ప్రయాణించవద్దని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. పలు సంస్థలు ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరాయి. అండర్ టన్నెళ్లలో నిలిచిన నీటిని తొలగించేందుకు మున్సిపల్, బెస్కాం, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ దళం ప్రయత్నాలు ప్రారంభించారు.

రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు చాలా చోట్ల పెద్ద చెట్లు కూలిపోయాయి. ఆ మార్గాల్లో వాహన రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వర్షం కురుస్తున్న సమయంలో హఠాత్తుగా సర్వీసు రోడ్లపైకి వరద నీరు చేరుతోంది. ఇక, ఈ నెల 1 నుంచి 22 వరకు నగరంలో 241 మి.మీ. వర్షపాతం నమోదయ్యింది. గత 124 సంవత్సరాలలో ఇది నాలుగో అత్యధిక వర్షం అని అధికారులు చెప్పారు. 1943, 1970, 2005లో కూడా ఇలాగే ఎక్కువ వర్షం కురిసింది. రెండు వారాలుగా నగరంలో కొన్ని చోట్ల 150 మి.మీ.లకు పైగా వర్షపాతం నమోదైంది. దీంతో ఐటీ కారిడార్లలో ఉద్యోగుల కష్టాలు వర్ణనాతీతం.

ఇక, ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని బెంగళూరువాసులకు సోమవారం రాత్రి మొత్తం నిద్ర కరవైంది. సోమవారం అర్ధరాత్రి నుండి మొదలైన వాన వల్ల వాగులు, వంకలు ఉప్పొంగాయి. యలహంక కేంద్రీయ విహార్‌లో రాత్రికిరాత్రే నడుము లోతుకు నీళ్లు వచ్చేశాయి.

Advertisement

Loading

Trending