Connect with us

Latest Updates

పాంగాంగ్ సరస్సు వద్ద చైనా పెద్ద సంఖ్యలో నిర్మాణాలు.. శాటిలైట్ ఫోటోలు బయటపడ్డాయి

సరిహద్దుల్లో దాయాది పాకిస్థాన్ కంటే అత్యంత ప్రమాదకారి చైనాయే. గత నాలుగేళ్ల నుంచి భారత్, చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. గల్వాన్ లోయలో ఇరు సైన్యాలు ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్దరణకు అనేక ప్రయత్నాలు జరిగాయి. దౌత్యపరంగా చర్చలు జరిగినా అంతంత మాత్రంగానే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చైనా వివాదాస్పద స్థలాల్లో నిర్మాణాలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. గతంలో నియంత్రణలో లేని ప్రాంతాలకు అది విస్తరిస్తోంది.

సరిహద్దుల్లో చైనా వ్యవహారం నోటితో నవ్వుతూ, నొసటితో వ్యంగ్యంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది.ఓవైపు, ఉద్రిక్తతలను తగ్గించుకోడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు సాగిస్తూనే.. మరో పక్క పాంగాంగ్‌ సరస్సు ఉత్తర తీరానికి దగ్గర్లో భారీగా నిర్మాణాల్ని డ్రాగన్ చేపట్టింది. తాజాగా, ఈ విషయం ఉపగ్రహాలు తీసిన ఫోటోలు బయటపెట్టాయి. ఈ నిర్మాణాలు భారత్‌-చైనా దళాల మధ్య 2020లో ప్రతిష్టంభన కొనసాగిన ప్రదేశానికి తూర్పున దాదాపు 38 కిలోమీటర్ల దూరంలో భారత ప్రాదేశిక భూభాగానికి అవతలి వైపు ఉన్నాయి. లడఖ్‌లో ఉన్న ఎత్తైన పాంగోంగ్ సరస్సుపై చైనా కొత్తగా నిర్మించిన వంతెన, సరస్సు తూర్పు వైపున 15 కి.మీ దూరంలో ఉంది.

సైనిక వర్గాల ప్రకారం, ఇది బీజింగ్ ఇటీవల వాస్తవాధీన రేఖ దగ్గర ఒత్తిడిని పెంచడానికి చేసిన మరో ప్రయత్నం. పాంగోంగ్ సరస్సు భారత్-చైనా పాలిత టిబెట్ మధ్య వివాదాస్పద సరిహద్దుగా ఉంది. తక్షశిల ఇన్‌స్టిట్యూషన్ ప్రొఫెసర్ నిత్యానందం ప్రకారం, అక్కడ 100కు పైగా భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. హెలికాప్టర్‌ ఆపరేషన్ల కోసం దీర్ఘ చతురస్రాకార స్ట్రిప్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. ఎత్తైన పర్వ శిఖరాల వెనుక జరుగుతున్న ఈ నిర్మాణాలు వ్యూహాత్మక ప్రయోజనాన్ని కలిగి ఉంటాయని నిత్యానందం పేర్కొన్నారు.

భారత సైన్యం అంచనా ప్రకారం, ఆ ప్రాంతాన్ని సైనిక అవసరాల కోసం ఉపయోగిస్తే, చైనా దళాలు ప్రతిస్పందించడానికి సమయం తగ్గిపోతుంది. క్షిపణి దాడుల సంభావ్య ప్రభావాన్ని తగ్గించడానికి ఈ నిర్మాణాలు చేపట్టినట్టు భావిస్తున్నారు. ‘ఈ ప్రాంతంలో చైనా నిర్మాణ కార్యకలాపాల్లో పాలుపంచుకున్న సైనికులు, పోర్టర్‌లకు వసతి, వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న స్థానాలకు తక్షణమే చేరుకోడానికి లాజిస్టిక్‌ నిల్వకోసం వీటిని చేపట్టింది.. ‘ఒక్కో నిర్మాణంలో 6-8 మంది సైనికులు లేదా 10 టన్నుల వరకు లాజిస్టిక్‌లు ఉంటాయి అని సైనిక నిపుణులు అంటున్నారు. ‘‘అందులో ఆర్టిలరీ షెల్స్‌తో పాటు పేలుడు పదార్థాలు ఉండే అవకాశం ఉంది’’ అని సైనిక వర్గాలు చెప్పారు.

ఈ ప్రాంతంలో క్రేన్లు, గోదాములు మరియు భారీ యంత్రాలు ఉన్నట్టు ఉపగ్రహ ఫోటోలు విశ్లేషించి గుర్తించారు.నిర్మాణాలు చేపట్టి ప్రాంతాన్ని చైనా రెండు విధాలుగా ఉపయోగించుకోనుందని పాకిస్థాన్‌‌‌పై భారత్ సైన్యం సర్టికల్ డాడుల్లో పాల్గొన్న నార్తర్న్ ఆర్మీ మాజీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా అన్నారు. ‘కేవలం పౌరులకు మౌలిక సౌకర్యాలను మెరుగుపరుస్తామని చైనా చెబుతున్నా కానీ ఇది స్పష్టంగా ద్వంద్వ-వినియోగ మౌలిక సదుపాయాలు. దీనిని సైన్యం సంఘర్షణ సమయంలో ఉపయోగించుకుంటుంది.’ అని ఆయన వ్యాఖ్యానించారు. నిర్మాణం చేపట్టిన ఈ ప్రదేశం క్షేత్రస్థాయిలోనూ వాస్తవ పరిస్థితులను మార్చగలదని అభిప్రాయపడ్డారు.

Advertisement

భారత్ చైనాల మధ్య 2005లో కుదిరన ఒప్పందం ప్రకారం.. సరిహద్దుల్లో ఉండే ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సి ఉంటుంది. అయితే, భారత్‌వి చెప్పుకునే స్థిర జనాభా లేని ప్రాంతాలలో ఈ గ్రామాలను సృష్టించడం ద్వారా చైనా తన వాదనలను బలోపేతం చేయడానికి, మన బేరసారాల స్థితిని బలహీనపరచడానికి ప్రయత్నిస్తోందిని హుడా అన్నారు.

Loading

Trending