Connect with us

Sports

సాహో భారత్.. రెండో టెస్టులో 2 రోజుల్లోనే విజయం, టెస్టు క్రికెట్‌లోనే అద్భుతం!

భారత క్రికెట్ జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. వర్షం కారణంగా సుమారు 8 సెషన్ల ఆట తుడిచిపెట్టుకుపోయినా.. మరో సెషన్ మిగిలి ఉండగానే టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించింది. కాన్పూర్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఈ ఫీట్‌ సాధించింది. టీ20 తరహాలో 8కి పైగా రన్‌రేట్‌తో తొలి ఇన్నింగ్స్‌లో పరుగులు చేసిన టీమిండియా.. ప్రత్యర్థి బ్యాటర్లకు కళ్లెం వేసి మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఇప్పటికే తొలి టెస్టులో 280 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన భారత్.. కాన్పూర్‌ టెస్టులోనూ గెలిచి.. టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

ఓవర్‌నైట్‌ స్కోరు 26/2తో ఐదో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్.. భారత బౌలర్ల దెబ్బకు 146 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 3, రవిచంద్రన్ అశ్విన్ 3, రవీంద్ర జడేజా 3 వికెట్ల చొప్పున తీశారు. ఆకాశ్‌ దీప్‌కు ఒక వికెట్‌ దక్కింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన లీడ్‌తో కలిపి భారత్‌ ముందు 95 పరుగుల లక్ష్యం నిలిచింది.

అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. మరో సెషన్ మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించింది. 95 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యశస్వి జైశ్వాల్‌ (51) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో భారత్‌ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌ చేరే దిశగా మరో ముందడుగు వేసింది.

డ్రాగా ముగియాల్సిన మ్యాచ్‌లో..
వాస్తవానికి కాన్పూర్ టెస్టు డ్రాగా ముగుస్తుందని అంతా భావించారు. ఎందుకంటే తొలి మూడు రోజుల్లో కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. అయితే నాలుగో రోజు ఆటలో భారత్ అద్భుతం చేసింది. బంగ్లాదేశ్‌ను 233 పరుగులకు ఆలౌట్ చేసిన తర్వాత.. టీ20 మోడ్‌లోకి వెళ్లిపోయింది. బ్యాటింగ్‌లో బంగ్లాదేశ్ బౌలర్లకు భారత బ్యాటర్లు చుక్కలు చూపించారు. టెస్టు మ్యాచా లేక టీ20నా అని ఆశ్చర్యపోయేలా పరుగుల వరద పారించారు. 34.4 ఓవర్లలోనే 285/9తో భారత్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 52 పరుగుల లీడ్‌ లభించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ను 144 పరుగులకే కుప్పకూల్చి.. విజయాన్ని ఖరారు చేసుకుంది.

రెండు రోజుల్లోనే ఫలితం
మొత్తంగా ఆరు సెషన్లు (2 రోజులు) అంటే 180 ఓవర్లలోపే మ్యాచ్ ఫలితం రావడం గమనార్హం. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 74.2 ఓవర్లలో 233 రన్స్‌కి ఆలౌట్ అయింది. భారత్‌ 34.4 ఓవర్లలో 285/9 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 47 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్‌ 17.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా పలు రికార్డులు నమోదు చేసింది.

Advertisement

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending