Connect with us

Andhra Pradesh

బైక్‌పై హెల్మెట్ పెట్టుకుంటే బహుమతి.. ఎక్కడంటే..?

బైక్‌పై హెల్మెట్ పెట్టుకుంటే గిఫ్ట్‌లు ఏంటని అనుకుంటున్నారా?.. మీరు విన్నది నిజమే.. బైక్‌పై హెల్మెట్ పెట్టుకుంటే గిఫ్ట్ ఇస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం సర్కిల్ పోలీసులు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. కొంతకాలంగా జాతీయ రహదారి ఆనుకుని ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు పోలీసులు.

ఈ రోడ్డు ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి పిఠాపురం సర్కిల్ పోలీసులు ఫోకస్ పెట్టారు. అందుకే నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు విధించడంతో పాటుగా హెల్మెట్లు ధరించి నిబంధనలు పాటిస్తున్న వాహనదారులకు బహుమతులు ఇస్తున్నారు.

బైక్‌పై వెళ్లే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గొల్లప్రోలు జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా దగ్గర వాహనాల తనిఖీలు చేసారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు జరిమానా విధించారు. ఇక హెల్మెట్లు ధరించి బైకులు నడుపుతున్నవారిని పిలిచి మరీ.. వారిని ప్రోత్సహించేలా గిఫ్టులు ఇస్తున్నారు. ఈ వినూత్న కార్యక్రమంపై కొంతమంది ద్విచక్ర వాహనదారులు పోలీసులను ప్రశంసించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

 

Advertisement

Loading

Trending