Connect with us

Andhra Pradesh

ఏపీలో పింఛన్ తీసుకునే వారికి ఒక సమాచారం.. ఇకపై పింఛన్ డబ్బులు వారి అకౌంట్లలోనే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్‌ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొంతమంది విద్యార్థులు దివ్యాంగ పింఛన్‌లు పొందుతున్నారు.. వారిలో కొందరు సొంత ఊరికి దూరంగా హాస్టల్స్, గురుకులాల్లో చదువుకుంటున్నారు. వీరు ప్రతి నెలా సొంత ఊరికి వచ్చి పింఛన్ తీసుకోవాల్సి వస్తోంది. ప్రతినెలా సెలవు తీసుకుని ఊరికి రావడం కొందరికి ఆర్థికంగా కష్టం అవుతోంది, మరికొందరు ప్రయాణం చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై వారి బ్యాంకు అకౌంట్‌లలోనే డబ్బులు జమ చేయాలని నిర్ణయించింది. దివ్యాంగ విద్యార్థులకు పింఛన్‌ డబ్బుల్ని బ్యాంకు అకౌంట్‌లలో జమ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

ఇలా బ్యాంక్ అకౌంట్‌లో పింఛన్ డబ్బుల్ని జమ చేసే వెసులుబాటు కేవలం దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న వారికే పరిమితం చేసింది ప్రభుత్వం. తమ బ్యాంక్ అకౌంట్లో పింఛన్ డబ్బులు జమ చేయడానికి ఒప్పుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హుల్ని గుర్తించే పనిని అధికారులు చేస్తున్నారు. ఈ మేరకు పింఛన్ పొందే దివ్యాంగులైన విద్యార్థులు దూర ప్రాంతంలో ఉండి చదువుకుంటుంటే.. వారికి డీబీటీ ద్వారా బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు.

ఇలా పింఛన్ డబ్బుల్ని ప్రతి నెలా నేరుగా బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేసేందుకు కొన్ని డాక్యుమెంట్లు సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులు స్టడీ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ కాపీ, ఆధార్ కార్డు కాపీ, సదరం సర్టిఫికెట్, పెన్షన్ ఐడీ, స్కూల్ / కాలేజీ ఐడీ, సెల్ఫ్ ఫోటో, MPDO ధ్రువీకరిస్తూ పత్రం సమర్పించాలన్నారు. ఈ డాక్యుమెంట్లను DRDA PD కార్యాలయంలో అందించాలని సూచించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రతినెలా ఊరికి వెళ్లి డబ్బులు తీసుకునే పని లేకుండా.. నేరుగా బ్యాంక్ అకౌంట్‌లలోనే డబ్బుల్ని జమ చేయనున్నారు. వచ్చే నెల నుంచి ఈ విధానం అమలు చేయవచ్చు.

ప్రతి నెలా ఒకటో తేదీన ఇచ్చే పింఛను తీసుకోవడానికి.. ఒక రోజు ముందే కాలేజీలు, స్కూళ్లలో అనుమతి తీసుకుని అవస్థలు పడుతూ రావాల్సి వచ్చేదంటున్నారు దివ్యాంగ విద్యార్థులు. ఒంటరిగా ఊరికి రావడం కష్టం అవుతోంది, తిరిగి వెళ్లడానికి కూడా కష్టపడుతున్నామని అంటున్నారు. దీనికి తోడు ఆర్థికంగా భారంగా మారిందంటున్నారు.. తమ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బ్యాంకు అకౌంట్‌లలో పింఛను సొమ్ము జమ చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో దివ్యాంగులకు ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పథకంలో 8.50 లక్షల మంది ప్రతినెలా పింఛన్ పొందుతున్నారు.  వీరికి వయసుతో సంబంధం లేకుండా 45 శాతం వైకల్యం పైబడిన వారికి వివిధ విభాగాల్లో రూ.6 వేల నుంచి రూ.15 వేల వరకు పించన్ అందిస్తోంది ప్రభుత్వం. వీరిలో 10వేలమంది విద్యార్థులు గురుకులాలు, హాస్టల్స్‌లో చదువుకుంటూ పింఛను అందుకుంటున్నట్లు గుర్తించారు. వీరిలో సమ్మతి తెలిపినవారికి పింఛన్ డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు.

Advertisement

Loading

Trending