Connect with us

Latest Updates

ఒడిశాలో కదులుతున్న రైలుపై దుండగుల కాల్పులు..

కదులుతున్న రైలుపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటన ఒడిశాలోని భద్రక్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి పూరీకి వస్తున్న నందన్‌కానన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుపై భద్రక్, బవుసపూర్‌ రైల్వే జంక్షన్ దగ్గర దుండగులు రెండు సార్లు కాల్పులు జరిపారు. గార్డు బోగీ కిటికీకి బుల్లెట్ తగలడంతో అద్దం పగిలింది. ఈ శబ్దానికి తాను బయటకు రాగా.. చేతిలో తుపాకితో దుండగుల్లో ఒకరు పారిపోతూ కనిపించారని గార్డ్‌ మహేంద్ర బెహరా తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెప్పారు.

కేసు నమోదుచేసిన పోలీసులు.. కాల్పులు జరిపింది ఎవరనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు. ఘటనతో రైలును భద్రక్ స్టేషన్ వద్ద కొద్దిసేపు నిలిపివేయగా.. తర్వాత అది సురక్షితంగా పూరీకి చేరుకుంది. “భద్రక్ సౌత్ ట్రాఫిక్ గేటు దగ్గర సిగ్నల్స్ మార్చిపోతుండగా, గుర్తుతెలియని వ్యక్తి రైలుపై కాల్పులు జరిపాడు. అతడికి తుపాకి ఉందని నేను చూశాను. రెండో రౌండ్ కాల్పులతో పొగలు రావడం గమనించాను. మొదట రాళ్లు విసిరారు అనుకున్నా, డోర్ దగ్గర వెళ్లి చూసినపుడు ఒకరికి తుపాకి ఉన్నట్టు తెలుసుకున్నాను” అని మహేంద్ర అన్నారు.

‘‘12816 ఢిల్లీ ఆనందర్ విహార్- పూరీ నందన్‌కానన్ ఎక్స్‌ప్రెస్ రైలు గార్డు వ్యాన్ కిటికీకి ఏదో తగిలి అద్దాలు పగిలినట్టు నివేదించారు. “ఈ సంఘటన ఒడిశాలోని భద్రక్-బౌద్‌పూర్ ప్రాంతంలో జరిగిందని తూర్పు కోస్తా రైల్వే అధికారులు చెప్పారు.” ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారని తెలిపారు. దుండగుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇటీవల రైలు పట్టాలపై ఇనుక కడ్డీలు, గ్యాస్ సిలిండర్లు పెట్టే ఘటనలు జరిగాయి. ఇలాంటి సమయంలో రైలు పై కాల్పులు జరపడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఘటన జరిగి 24 గంటల కావస్తున్నా ఎవరు కాల్పులు జరిపారనేది తెలియరాలేదు.

Loading

Trending