Connect with us

Latest Updates

చేతిలో రాజ్యాంగం కేరళ చేనేత చీర థరించి  ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం

చేతిలో రాజ్యాంగం కేరళ చేనేత చీర థరించి  ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం

కేరళలో వయనాడ్‌ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ గెలిచారు. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి, పార్లమెంట్‌లో సభ్యురాలిగా అడుగు పెట్టారు. గురువారం ఆమె లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. వయనాడ్‌లో రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఉపఎన్నికలు జరిగాయి. దీంతో ఆయన సోదరి ప్రియాంకను ఆ స్థానం నుంచి పోటీ చేయించారు. వయనాడ్ ప్రజల గొంతుకగా ప్రియాంక పనిచేస్తారని రాహుల్ అప్పట్లోనే చెప్పారు.

కేరళలోని వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గురువారం ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ ఓం బిర్లా ఆమెతో ప్రమాణం చేయించారు. ప్రియాంక ప్రమాణస్వీకార వేడుకను ఆమె సోదరుడు రాహుల్ గాంధీ, తల్లి సోనియా గాంధీ, అలాగే పిల్లలు రెహాన్ వాద్రా, మిరాయా వాద్రా ప్రత్యక్షంగా చూసారు. తల్లి సోనియా గాంధీ ముందు ప్రమాణం చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రియాంక అన్నారు. కేరళ సంప్రదాయ చేనేత చీరను ప్రియాంక ధరించారు. స్పీకర్ ఓం బిర్లా ఆమె పేరును పిలిచిన వెంటనే, ప్రియాంక చేతిలో రాజ్యాంగ పుస్తకంతో వచ్చి ప్రమాణం చేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలిచిన రాహుల్ గాంధీ వయనాడ్‌ స్థానానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఉపఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేసి పెద్ద మెజారిటీతో గెలిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటిసారే మంచి విజయాన్ని సాధించి, తొలిసారి ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.

ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నేటి నుంచి గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురు పార్లమెంట్‌లో ఉంటారు. రాయబరేలీ నుంచి రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యుడు, సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు. ఇప్పుడు వయనాడ్ నుంచి గెలిచిన ప్రియాంక కూడా అధికారికంగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.

Advertisement

ఎంపీగా ప్రమాణం చేసిన ప్రియాంక గాంధీ తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఆమె ప్రమాణం చేస్తుండగా, కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి సభ్యులు చప్పట్లు కొట్టి లోక్‌సభను సందడి చేశారు. “భారత్ జోడో” అంటూ నినాదాలు చేశారు. ప్రియాంక తర్వాత నాందేడ్ ఉపఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎంపీ రవీంద్ర చవాన్ కూడా ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత ఉత్తర్ ప్రదేశ్‌లోని శంభాల్ విషయం మరియు అదానీ అంశాలపై చర్చ చేయాలని విపక్షాలు పట్టుబట్టారు. దీనితో సభలో గందరగోళం ఏర్పడింది. స్పీకర్ సభను వాయిదా వేశారు.

వయనాడ్‌లో 4.10 లక్షలపైగా ఓట్ల మెజార్టీతో సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ అభ్యర్థి సత్యన్ మోకేరిని ప్రియాంక గాంధీ ఓడించారు. ఆమె తొలి అడుగే బలంగా పడింది. ఇక, కేరళ సంప్రదాయం ఉట్టిపడేలా కసవ్ చీరను ధరించి.. మొదటి రోజే కేరళవాసులకు ప్రతినిధిని చెప్పకనే చెప్పారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వయనాడ్ ప్రజలను ఉద్దేశించి ఆమె ఉద్వేగపూరితమైన పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. తనను ఆదరించిన వయనాడ్ ప్రజలకు రుణపడి ఉంటానని, వారి గొంతుకను పార్లమెంట్‌లో బలంగా వినిపిస్తానని హామీ ఇచ్చారు.

 

 

Loading

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending