Connect with us

Telangana

హైదరాబాద్ మెట్రోలో తలెత్తిన సాంకేతిక సమస్య.. ట్రైన్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి..

హైదరాబాద్ మెట్రో ట్రైన్లలో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో ట్రైన్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నాగోల్-రాయదుర్గం, ఎల్బీనగర్-మియాపూర్ మార్గాల్లో రైళ్లు ఆగిపోయాయి. దాదాపుగా 30 నిమిషాలకు పైగా మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. ఉద్యోగులు ఆఫీసుకు, విద్యార్థులు కాలేజీలకు వెళ్లే సమయం కావటంతో మెట్రో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని మెట్రో స్టేషన్లలోనూ ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది.

ట్రైన్లు సకాలంలో రాకపోవటంతో మెట్రో ప్లాట్‌ఫాంపై ప్రయాణికులు భారీగా చేరుకుంటున్నారు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో అయితే ఇసుకేస్తే రాలనంతగా ప్రయాణికులు ప్లాట్‌ఫాంపై నిరీక్షిస్తున్నారు. ట్రైన్లలో ఉన్నవారు ట్రైన్లలో.. స్టేషన్లలో ఉన్నవారు స్టేషన్లలోనే ఉండిపోయారు. ఈ సమస్యపై హైదరాబాద్ మెట్రో అధికారులు ఇంకా ఏ ప్రకటన చేయలేదు.

మెట్రో రెండో దశకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌ నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణ పనులు చేపట్టేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇందుకోసం రెండ్రోజుల క్రితం ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. సెకండ్ ఫేజ్‌లో మొత్తం 76.4 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేయనున్నారు. అందుకు అనుమతి కూడా వచ్చింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల కలసి రెండో దశ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు.

మొత్తం మెట్రో ప్రాజెక్టు వ్యయం రూ.24,269 కోట్లు కాగా.. అందులో తెలంగాణ ప్రభుత్వ వాటారూ.7,313 కోట్లు ప్రస్తుతం నగరంలో మూడు కారిడార్లలో మెట్రో పరుగులు పెడుతుండగా.. కొత్తగా 5 మార్గాల్లో మెట్రో రెండో దశ విస్తరించనున్నారు. నాగోలు- శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.8 కిలోమీటర్లు, రాయదుర్గ- కోకాపేట వరకు 11.6 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ నుంచి చాంద్రయాణగుట్ట వరకు 7.5 కిలోమీటర్లు, మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు 13.4 కిలోమీటర్లు, ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్లు మెట్రోను విస్తరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది.

Advertisement

Loading

Trending