Connect with us

Telangana

కాలితో తన్ని మరీ.. ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసారు..

సికింద్రాబాద్‌ పరిధిలోని మోండా మార్కెట్‌ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండగులు పూర్తిగా ధ్వంసం చేశారు. ఆదివారం (అక్టోబర్ 13న) రోజు రాత్రి సమయంలో ఆలయంలో నుంచి శబ్దాలు రావడంతో స్థానికులు మేల్కొని.. పారిపోతున్న ముగ్గురు దుండగుల్లో ఒకరిని పట్టుకుని కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదుచేసిన పోలీసులు.. పారిపోయిన వారికోసం గాలింపు చేపట్టారు. అయితే.. ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించగా.. ఓ దుండగుడు అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్నుతూ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టుగా ఉంది. ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో.. హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విషయం తెలుసుకున్న హిందూ సంఘాల కార్యకర్తలు, బీజేపీ నేతలు.. ముత్యాలమ్మ ఆలయం వద్దకు భారీగా చేరుకున్నారు. అమ్మవారి విగ్రహాన్ని ఎవరైతే ధ్వంసం చేసారో ఆ దుండగులను కఠినంగా శిక్షించాలని ఆందోళనకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు.. ఎలాంటి అవాంఛనీయం ఘటనలు చోటుచేసుకోకుండా.. ఘటనాస్థలిలో పెద్ద సంఖ్యలో మోహరించారు. ఈ క్రమంలోనే.. కేంద్ర కిషన్‌ రెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు ఆలయాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు.

తెలంగాణలో మత కలహాలు జరగకుండా అడ్డుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్‌ను కేంద్ర కిషన్‌ రెడ్డి డిమాండ్ చేశారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో పాటుగా గేట్లు కూడా విరగొట్టారని కిషన్ రెడ్డి తెలిపారు. హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నారంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆలయాలపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దేవాలయాలకు పటిష్ట భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి కోరారు.

అనంతరం.. మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌.. మత విద్వేషాలను ప్రేరిపించేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నిన్నటివరకు ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్గామాత నవరాత్రులు, బతుకమ్మ వేడుకులు జరుపుకున్న ప్రజలు.. ఈరోజు ఇలా అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయటాన్ని ఏమాత్రం సహించలేరని హెచ్చరించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులు ఎంతటివారైనా సరే కఠినంగా శిక్షించాలని స్థానికులు పోలీసులను డిమాండ్ చేశారు.

Advertisement

Loading

Trending