Connect with us

Telangana

HYD మెట్రో సెకండ్ ఫేజ్.. సరి కొత్త సదుపాయాలతో..

హైదరాబాద్ మెట్రో నగర ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 3 కారిడార్లలో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 5 లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు రాకపోకలు సాగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణానికి సైతం సిద్ధమైంది. రాయదుర్గం – కోకాపేట్, ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట, నాగోల్ – శంషాబాద్, ఎల్‌బీనగర్ – హయత్ నగర్, మియాపూర్ – పటాన్‌చెరు మార్గాల్లో మొత్తం 76.4 కిలోమీటర్ల మేరకు విస్తరణ చేపట్టాలని ఇటీవల తెలంగాణ కేబినెట్ డీపీఆర్‌కు ఆమోదముద్ర వేసింది.

ఇక మెట్రో సెకండ్ ఫేజ్ ప్రాజెక్టులో ప్రయాణికులకు సరికొత్త ప్రయాణ అనుభూతిని అందించేందుకు అంత సిద్దమవుతుంది. ప్రస్తుతం థర్డ్ జనరేషన్ కోచ్‌లు వాడుతుండగా.. సెకండ్ ఫేజ్‌లో ఫోర్త్ జనరేషన్ కోచ్‌లు ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నారు. అలానే ప్రయాణికుల సేఫ్టీ కోసం ప్లాట్‌ఫాంపై స్క్రీన్‌ డోర్లు ను ఏర్పాటు చేస్తున్నారు. స్టేషన్ల వద్ద ఎకరం విస్తీర్ణంలో పార్కింగ్‌ ఏర్పాట్లు వంటివాటిని తాజా డీపీఆర్‌లో ప్రతిపాదించారు.

సెకండ్ ఫేజ్‌ మెట్రోలో మొత్తం 5 కారిడార్లలో రూ.24,269 కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఫోర్త్ జనరేషన్ కోచ్‌లతో డ్రైవర్ లేకుండానే మెట్రో పరుగులు తీస్తుంది. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఆటోమేటిక్‌గా ఈ ట్రైన్లు నడపనున్నారు. కొత్త కోచ్‌లు మరింత అద్భుతంగా, అధునాతనంగా ఉండనున్నాయి. ఢిల్లీ, చెన్నై మెట్రోల తరహాలో.. ప్రయాణికుల భద్రత కోసం ఫ్లాట్‌ఫాంపై స్క్రీన్‌ డోర్లు (పీఎస్‌డీ) ఏర్పాటు చేయనున్నారు.

ఇక సెకండ్ ఫేజ్‌లో ఖర్చును తగ్గించేందుకు ‘యు’ గిడ్డర్‌ విధానంలో ట్రాక్‌ పనులు జరుగుతాయి. ఫస్ట్ ఫేజ్‌లో దుకాణాలు, వాణిజ్య అసరాల కోసం రెండు అంతస్తుల్లో మెట్రో స్టేషన్లు నిర్మించారు. రెండో ఫేజ్‌లో మాత్రం ఒక అంతస్తులోనే స్టేషన్‌ చిన్నగా నిర్మించనున్నారు. జంక్షన్‌ స్టేషన్లు మాత్రమే రెండు అంతస్తుల్లో ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న మెట్రో స్టేషన్లలో పార్కింగ్‌ సదుపాయం లేక ప్రయాణికులు చాల ఇబ్బందులు పడ్డారు. ఈ దశలో ఆ తిప్పలు ఉండవ్. ఇక నుంచి ప్రతి స్టేషన్‌ కి దగ్గర్లో ఒక ఎకరం గవర్నమెంట్ స్థలంలో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు. దింతో పాటుగా ప్రతి కారిడార్‌కు ప్రత్యేకంగా డిపో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈ మేరకు అధికారులు డీపీఆర్ సిద్ధం చేశారు. కేంద్రానికి డీపీఆర్ పంపి ఆమోదం తర్వాత పనులు చేపట్టనున్నారు.

Advertisement

Loading

Trending