Connect with us

Telangana

వామ్మో.. పోలీసులయ్యుండి ఇదేం పని, కొంచెమైనా సిగ్గుండక్కర్లే..!

తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటూనే ఉంది. గంజాయి, డ్రగ్స్ వంటివి అరికట్టేందుకు తెలంగాణ పోలీస్‌శాఖ, తెలంగాణ నార్కొటిక్‌ కంట్రోల్‌బ్యూరో స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ మేరకు పోలీసుల చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. అయితే కొందరు పోలీసులు స్మగ్లర్లతో చేతులు కలుపుతున్నారు. పోలీసులయ్యుండి.. గంజాయి అక్కమార్కులతో చేతులు కలిపి డిపార్ట్‌మెంట్ పరువు బజారుకీడుస్తున్నారు. తాజాగా.. గంజాయి స్మగ్లర్లతో చేతులు కలిపిన నలుగురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వాళ్లకు దొరికిన గంజాయిని రెండు సార్లు వదిలేసి స్మగ్లర్ల నుంచి డబ్బులు తీసుకున్న ఇద్దరు ఎస్సైలు, ఓ హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్‌పై వేటు పడింది.

పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం.. పటాన్‌చెరువు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న అంబారియా, వీఆర్‌లో ఉన్న ఎస్సై వినయ్‌ కుమార్‌, సంగారెడ్డి సీసీఎస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మారుతి నాయక్, మనూర్‌ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ మధు ఒక బృందంగా ఏర్పడ్డారు. ఎస్సై వినయ్‌కు గంజాయి స్మగ్లర్లతో ముందు నుంచి సంబంధాలున్నాయి. ఈ ఏడాది మే 31న అంబారియా మనూర్‌ పీఎస్ ఎస్సైగా పనిచేసిన ఆ సమయంలో గంజాయి స్మగ్లింగ్ గురించి వీళ్లకి సమాచారం అందింది. దీంతో ఎస్సై వినయ్‌ కుమార్, మారుతి నాయక్, మధు అందరు కలసి స్మగ్రర్ల కోసం మాటు వేశారు. నిజామాబాద్‌ జిల్లా సయిత్పూర్‌ సమీపంలో గంజాయి స్మగ్లర్ల వాహనాన్ని అడ్డగించారు. వాహనంలోని 120 కిలోల గంజాయిని పట్టుకున్నారు. సగ్మర్ల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి వారిని అప్పుడే వదిలేశారు. ఏడు నెలల క్రితం కూడా నిజామాబాద్‌ జిల్లా వర్నిలో స్మగ్లర్ల వద్ద డబ్బులు తీసుకొని ఇలానే గంజాయిని వదిలేశారు.

అయితే ఇటీవల సంగారెడ్డి జిల్లా చిరాగ్‌పల్లి, బీడీఎల్‌ భానూర్‌ పీఎస్‌ పరిధిలో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ మల్లుగొండ, మల్లేశ్‌నాయక్, లకాన్‌లు అనే వ్యక్తులు పోలీసులకు దొరికిపోయారు. గతంలోనూ వారిపై గంజాయి స్మగ్లింగ్ కేసులున్నాయి. ఎస్పీ చెన్నూరి రూపేశ్‌ ఆధ్వర్యంలో గంజాయి అక్రమ రవాణాపై విచారించారు. నిందితుల్లో ఒకరి సెల్‌ఫోన్‌లో కానిస్టేబుల్‌ మధు ఫోన్‌ నంబర్‌ సేవ్ చేసి ఉంది. అనుమానంతో నిందితుడిని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గంజాయి రవాణా ఇన్ఫార్మర్‌గా కానిస్టేబుల్ మధును వినియోగించుకున్నట్లు చెప్పాడు.

విచారణ జరిపిన ఉన్నతాధికారులు గంజాయి స్మగర్లతో చేతులు కలిపిన నలుగుర్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్పీ విచారణలో ఈ వ్యవహారాలు బయటపడడంతో ఐజీకి నివేదికను పంపించారు. దీని ఆధారంగా ఐజీ సత్యనారాయణ తాజాగా సస్పెన్షన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నలుగురిపై NDPS చట్టం కింద కేసు నమోదుకు ఉన్న అవకాశాలపై న్యాయ సలహాలు తీసుకుంటున్నామని మల్టీజోన్‌-2 ఐజీ వి సత్యనారాయణ వెల్లడించారు. ఒకరిద్దరితో పోలీస్‌శాఖ ప్రతిష్ఠకు భంగం కలుగుతోందన్నారు. అందుకే అలాంటి వారిపై కఠినచర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Advertisement

Loading

Trending