Connect with us

Andhra Pradesh

టీడీపీలో విషాదం చోటుచేసుకుంది.. మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మరణం..

టీడీపీలో విషాదం.. మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు. మంగళవారం ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో వయసురీత్యా వచ్చిన అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. ఇక రెడ్డి సత్యనారాయణ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు.. వివిధ పార్టీల నేతలు సంతాపం తెలుపుతున్నారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేతల్లో రెడ్డి సత్యనారాయణ ఒకరు.

మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత రెడ్డి సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఐదేసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా చేసిన సత్యనారాయణ నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. మాడుగుల నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేసి, నియోజకవర్గ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న సత్యనారాయణ మృతి తీవ్ర విచారం కలిగించిందన్నారు. మంత్రిగా పని చేసి పదవులకు వన్నె తెచ్చారన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

అయితే గతంలో మాడుగుల నియోజకవర్గం నుంచి  ఆయన వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయాలు సాధించారు. ఇక తెలుగు దేశం పార్టీ తరఫున వరుసగా 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. ఎన్టీఆర్‌ హయాంలో మంత్రిగా పనిచేశారు.. పశుసంవర్ధక శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాదు ఆయన టీటీడీ పాలకమండలి సభ్యుడిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో రెడ్డి సత్యనారాయణ టీడీపీ నుంచి మరోసారి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి కరణం ధర్మశ్రీ చేతిలో ఓటమిపాలయ్యారు.

ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు. రెడ్డి సత్యనారాయణ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి పదవి అనుభవించినప్పటికి చాలా నిరాడంబరంగా ఉండేవారు. సీనియర్ నేత అయుండి.. నిత్యం ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేసేవారు. రెడ్డి సత్యనారాయణ 2023 అక్టోబర్‌లో తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు.. ఆ తర్వాత కోలుకున్నారు. దాదాపు ఏడాది తర్వాత ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Loading

Trending