Connect with us

Andhra Pradesh

ఒంగోలులో చెడ్డీ గ్యాంగ్!.. వేట మొదలెట్టిన 400 మంది పోలీసులు

ఒంగోలును చెడ్డీ గ్యాంగ్ భయపెడుతోంది. ఒంగోలు నగరంలోకి చెడ్డీ గ్యాంగ్ దిగిందనే అనుమానాలతో స్థానికులకు కంటి మీద నిద్ర లేకుండా పోయింది. ముఖ్యంగా రామ్‌నగర్‌లోని నర్సింగ్ కాలేజిలో రూ.50 వేలు దొంగలు ఎత్తుకెళ్లారు. ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలోకి చొరబడిన దొంగలు.. కాలేజీలోని 50 వేల రూపాయలు ఎత్తుకుపోయారు. అయితే ఇది చెడ్డీ గ్యాంగ్ పనేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఒంగోలు పోలీసులు రెండు రోజులుగా చెడ్డీ గ్యాంగ్ కోసం గాలింపు చేపట్టారు. వారి కదలికలను తెలుసుకునే పనిలో పడ్డారు. 35 టీంలు, 400 మంది పోలీసులు చెడ్డీ గ్యాంగ్ కోసం తనిఖీలు, గాలింపు చేస్తున్నారు. మరోవైపు నగరంలోకి చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించిందనే అనుమానాలతో ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తాన్ని పోలీసులు అలర్ట్ చేసేసారు.

మరోవైపు దోపీడీ దొంగల కదలికలపై అనుమానంతో పోలీసులు ఒంగోలు నగరాన్ని జల్లెడ పడుతున్నారు. 400 మంది పోలీసులతో జిల్లాలో నాకాబందీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ కూడా స్వయంగా తనిఖీల్లో పాల్గొన్నారు. అనుమానంగా ఉండే వ్యక్తులను, కొత్త వ్యక్తులను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసారు. గుర్తు తెలియని వ్యక్తులు కనిపిస్తే వివరాలు తెలుసుకోవాలని, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీసులను ఎస్పీ ఆదేశించారు. ఎస్పీ ఆదేశాలతో రైల్వే స్టేషన్, బస్టాండ్, గ్రామశివార్లు ఇలా అన్ని చోట్లా పోలీసులు తనిఖీలు చేశారు.

ఒంగోలు పరిసర ప్రాంతాల్లో కొన్ని ముఠాలు తిరుగుతున్నాయన్న డీఎస్పీ నాగరాజు.. తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తున్నట్లు చెప్పారు. ఆలయాలను సైతం లక్ష్యంగా చేసుకుని హుండీ దొంగతనాలను పాల్పడుతున్నట్లు వెల్లడించారు. ఒంగోలు అలానే పరిసర ప్రాంతాల్లో చెడ్డి గ్యాంగ్ సంచారాన్ని సైతం గుర్తించామన్న డీఎస్పీ.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మీ ప్రాంతంలో ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే పెళ్లిళ్లు, పండుగల కోసం ఊరికి వెళ్తుంటే.. విలువైన వస్తువులను ఇంట్లో పెట్టుకోవద్దని, సురక్షితమైన ప్రాంతంలో భద్రపరుచుకోవాలని డీఎస్సీ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Loading

Trending