Connect with us

Telangana

తెలంగాణలో కొత్త రైల్వే లైన్‌.. రైల్వే శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల..

తెలంగాణలో రైల్వే లైన్ల అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అనేక మార్గాల్లో కొత్త రైల్వే లైన్లు నిర్మించారు. హైదరాబాద్‌లో అతి పెద్ద రైల్వే టెర్మినల్ చర్లపల్లిలో నిర్మస్తున్నారు. తాజాగా.. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నారు. రైల్వే శాఖ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రైల్వే లైన్ హనుమకొండ, జనగామ జిల్లాల మధ్య ఏర్పడనుంది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి రోడ్డు నుంచి ధర్మసాగర్ మీదుగా నష్కల్ వరకు గూడ్సు బైపాస్ లైన్ నిర్మాణం చేయబోతున్నారు. ఈ రైల్వే లైన్ మెుత్తం పొడవు 24.55 కి.మీటర్లు కాగా.. ఈ మేరకు భూసేకరణ కోసం కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ముందుగా ఈ లైన్‌ను పెండ్యాల దగ్గర 163వ నేషనల్ హైవే పక్కనుగా చేయాలని ప్రతిపాదించారు. తర్వాత బైపాస్‌ మార్గాన్ని మార్చుతూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ధర్మసాగర్‌ మీదుగానే బైపాస్‌ లైన్ నిర్మాణానికి రైల్వేశాఖ సిద్ధమైంది. అందుకు అవసరమైన భూసేకరణ చేపట్టాలని హనుమకొండ, జనగామ జిల్లాల్లోని హసన్‌పర్తి, చిల్పూర్‌, ధర్మసాగర్ రెవెన్యూ అధికారులకు నోటిఫికేషన్‌ అందించింది. ఈ లైన్‌తో పాటు నష్కల్‌ నుంచి మామునూరు మీదుగా గీసుకొండ మండలం చింతల్‌ రైల్వే స్టేషన్‌ వరకు రైల్వేశాఖ మరో బైపాస్‌ లైన్‌ను ప్రతిపాదించింది. గూడ్స్ ట్రైన్లు బైపాస్‌ల మీదుగా పంపించి కాజీపేట, వరంగల్‌ స్టేషన్లపై ఒత్తడి తగ్గించాలని చూస్తున్నారు.

ఈ లైన్ల వల్ల ప్రయాణికుల రైళ్ల రాకపోకలకు సులభంగా మారుతుంది. అందుకోసం ఈ రెండు మార్గాలను రైల్వేశాఖ ప్రతిపాదించింది. బల్లార్షా-కాజీపేట మార్గంలో గూడ్స్ ట్రైన్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అందువల్ల, ఈ మార్గంలో ముందుగా బైపాస్ లైన్లు నిర్మించాలని రైల్వేశాఖ అనుకుంటోంది. హసన్‌పర్తి రోడ్డు మరియు నష్కల్‌ రైల్వే స్టేషన్ల మధ్య నిర్మించే బైపాస్‌ రైల్వే లైన్‌ నష్కల్‌ లేదా పెండ్యాల వద్ద 163వ నేషనల్ హైవేను క్రాస్‌ చేయాలి. దీని వల్ల ధర్మసాగర్‌ గ్రామ ప్రజలు, రైతులకు ఇబ్బంది కావచ్చును. అందుకని ఈ రెండు చోట్ల వంతెనలు నిర్మించేందుకు రైల్వే శాఖ ప్రణాళిక చేస్తోంది.

Loading

Trending