Connect with us

Andhra Pradesh

తిరుపతిలో ఒక మెయిల్ చూసి పోలీసులు షాక్.. హడావిడిగా వెళ్లి చూస్తే ట్విస్ట్!

తిరుపతిలో ఓ మెయిల్ చూసి పోలీసులు కంగారుపడిపోయారు. వెంటనే హడావిడిగా పరుగులు తీశారు.. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఊహించని ట్విస్ట్ ఎదురైంది. నగరంలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి.. లీలామహల్‌ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్‌లో బాంబులు పెట్టామంటూ ఓ మెయిల్‌లో బెదిరింపులు వచ్చాయి. దాంతో వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యారు.. డీఎస్పీ వెంకట నారాయణ, పోలీస్ సిబ్బంది కలసి ప్రత్యేక బృందాలతో అక్కడికి వెళ్లి ఆ హోటల్స్‌లో తనిఖీలు చేపట్టారు. తీరా ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ మెయిల్ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే తిరుపతి పోలీసులకు వచ్చిన మెయిల్‌లో ‘తమిళనాడులో ఉగ్రవాది జాఫర్‌ సాదిక్‌కు జైలుశిక్ష పడింది. ఆ శిక్ష పడేందుకు ప్రభుత్వం తరఫున తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సహకారం అందించారు. సీఎం కుటుంబంతో పాటు తమిళనాడులోని కొన్ని పాఠశాలల్లో పేలుళ్లకు ISI సిద్ధమైంది’ అని మెయిల్‌లో ఉంది. ఈ క్రమంలోనే తిరుపతిలోని నాలుగు ప్రైవేటు హోటళ్లను పేల్చివేస్తామని ఆ మెయిల్ ద్వారా పోలీసుల్ని హెచ్చరించారు. దీంతో పోలీసులు ఉరుకులు పరుగులు తీశారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత బాంబులు లేవు.. ఇక దానిని ఫేక్ మెయిల్‌గా తేల్చారు.

మరోవైపు హోటల్స్‌లో మాత్రమే కాదు.. తిరుపతి విమానాశ్రయంలో స్టార్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. స్టార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎస్‌5-154 విమానానికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆదమ్‌లాన్‌జా 333 పేరుతో ఉన్న ఎక్స్‌ (ట్విట్టర్) అకౌంట్ నుంచి బెదిరింపు మెసేజ్ పంపారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇటీవల కాలంలో పలు విమానాలకు, పలు నగరాలకు బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. అలాగే ఇటీవల కొన్ని స్కూళ్లకు, ఇతర ప్రైవేట్ సంస్థలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే తిరుపతిలో హోటల్స్, విమానానికి బాంబు బెదిరింపు రావడం ఈ మధ్య తొలిసారి. మొత్తానికి ఆ మెయిల్ కాసేపు పోలీసుల్ని కంగారుపెట్టింది.. ఇక ఏమీ లేదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Loading

Advertisement

Trending