Connect with us

Andhra Pradesh

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల బస్సులో ప్రయాణం.. ఎందుకంటే..

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.. ఏం చేసినా కొంచెం విచిత్రంగా ఆలోచిస్తారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడమైనా, ప్రజల తరఫున పోరాటాలైనా ఆమె ఓ డిఫరెంట్ స్టైల్‌ ఫాలో అవుతుంటారు. గతంలో కూడా కేసీఆర్‌కు, వైఎస్ జగన్‌కు, చంద్రబాబుకు సెటైరికల్‌గా పలు గిఫ్టులు పంపించారు వైఎస్ షర్మిల. ఇప్పుడు మరోసారి అలాంటి తరహా పోరాటానికై రెడీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‍ మహిళల నుంచి చంద్రబాబుకు పోస్టు కార్డులు పంపించాలని వైస్ షర్మిల నిర్ణయించారు.

ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పిన హామీలను నెరవేర్చడం లేదని వైఎస్ షర్మిల అన్నారు. సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని.. పాలన చేపట్టి నాలుగు నెలలు దాటిపోయినా హామీల అమలును పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఇక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ విషయంలోనూ వాయిదాలు వేస్తున్నారని విమర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం నారా చంద్రబాబు నాయుడికి పోస్టు కార్డులు పంపుతామని ఆమె తెలిపారు. విజయవాడ నుంచి తెనాలికి ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వైఎస్ షర్మిల.. బస్సులోని ప్రయాణికులతో ముచ్చటించారు. ఉచిత బస్సు ప్రయాణం హామీ గురించి ప్రయాణికుల స్పందనను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఉచిత బస్సు హామీ కోసం ఎదురుచూస్తున్నట్లు కొంతమంది మహిళలు వైఎస్ షర్మిల వద్ద చెప్పుకున్నారు. దీంతో ఉచిత బస్సు హామీ అమలు కోసం అందరం కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని షర్మిల వారందరికీ సూచించారు. ఇందుకోసం సీఎం చంద్రబాబుకు పోస్టు కార్డులు రాయాలని వైఎస్ షర్మిల అన్నారు.

మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచిందన్న వైఎస్ షర్మిల.. తెలంగాణ, కర్నాటకలలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హామీని అమలు చేసినట్లు గుర్తుచేశారు. అయితే ఏపీలో మాత్రం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలూ పూర్తైనప్పటికీ హామీ అమలుపై స్పష్టత ఇవ్వడం లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు 20 లక్షల మంది మహిళలు బస్సులో ప్రయాణిస్తున్నారన్న షర్మిల.. దీని ద్వారా ఆర్టీసీకి రోజుకు 7 కోట్లు చొప్పున.. నెలకు రూ.300 కోట్లు ఆదాయం వస్తోందన్నారు. ఉచిత బస్సుని తీసుకొస్తే రూ.300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాల్సి వస్తుందనే భయమా అని ప్రశ్నించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సు హామీని నెరవేర్చడానికి కసరత్తు కూడా జరిపింది. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించేందుకు కమిటీ కూడా వేయాలని భావించింది.

Advertisement

Loading

Trending