Connect with us

Andhra Pradesh

ఇకపై పెళ్లిళ్లు చేసుకోవడానికి ఆ ఆలయంలో అనుమతి లేదు..

ఇకపై పెళ్లిళ్లు చేసుకోవడానికి ఆ ఆలయంలో అనుమతి లేదు..

ఒంటిమిట్ట కోదండ రామాలయానికి సంబంధించి అధికారులు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఇకపై ఆలయంలో పెళ్లిళ్లు చేసుకోవడానికి అనుమతి లేదని చెబుతున్నారు. గత పదేళ్లుగా ఆలయంలో వివాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అనుమతి ఇవ్వకపోవడంపై భక్తులు కోపం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా వస్తున్న సంప్రదాయాన్ని ఆపేయడంపై వారు మండిపుతున్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరుతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో రాముడు కొలువైన ఒంటిమిట్ట కోదండ రామాలయం గురించి తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. ఇకపై ఒంటిమిట్ట రామాలయంలో వివాహాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వకూడదని పెళ్లిలు జరగనీయకుండా ఆపేయాలని భారత పురాతత్త్వ-సర్వేక్షణశాఖ అధికారులు మౌఖిక ఆంక్షలు విధించారు. ఈ మేరకు టీటీడీ శుపరిపాలన యంత్రాంగానికి మొబైల్‌లో కాల్ చేసి ఆదేశించారు. పెళ్లిళ్లకు అనుమతులు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో భక్తులు అవాక్కయ్యారు. ఈ నిర్ణయం సరికాదని.. వెంటనే వెనక్కు తీసుకోవాలంటున్నారు. ఇది వాస్తవమేనని.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు ఆలయ తనిఖీ అధికారి నవీన్‌కుమార్‌.

ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వివాహాలు చేసుకునేందుకు అమ్మాయి, అబ్బాయి, తల్లిదండ్రుల ఆధార్‌ కార్డులు, శుభలేఖ అందించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆలయంలో వివాహ కట్టడి రుసుం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. గత పదేళ్లుగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. రామాలయంలో పనిచేస్తున్న భజంత్రీ సిబ్బంది, అర్చకుల ద్వారా వివాహం జరుపుతారు. వారికి నగదు ఇవ్వాలి. ఆలయంలో వేదిక, పందిళ్లు, షామియానాలు, లైట్లు, వివాహానికి అవసరమైన బల్లలు, అతిథులు కూర్చోడానికి కుర్చీలు లేవు. టిఫిన్, టీ, భోజనం వసతి కూడా లేదు.  రామలింగేశ్వరస్వామి ముందు, సీతారాముల ఎదుర్కోలు మండపాల చెంత చలువరాళ్లపై సాధారణంగా వివాహాలు నిర్వహిస్తారు. పదేళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది, కానీ ఇప్పటివరకు ఎవరి నుంచి కూడా అభ్యంతరాలు రాలేదు.

రామాలయం వేళల్లో ఉదయం 5 నుంచి సాయంత్రం 8.45 గంటల వరకు లగ్నం చూసుకుని వివాహాలు చేసుకునేవారు. ఈ పెళ్లి కార్యక్రమం 30 నుంచి 40 నిమిషాల్లో పూర్తవుతుందిట. అక్కడ భక్తులకు ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి పురావస్తుశాఖ అధికారులు ఇకపై వివాహాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వరాదని టీటీడీ అధికారులకు ఫోన్‌లో మౌఖిక ఆదేశాలిచ్చారు. ఈ నిర్ణయం సరికాదంటున్నారు భక్తులు.. కార్తిక మాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఇక్కడ రామాలయంలో పెళ్లి చేసుకునేందుకు వస్తున్నవారికి తాత్కాలికంగా అనుమతి ఇవ్వడం లేదు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఎలాంటి ఆంక్షలు లేవు అని.. ఇప్పుడు ఎందుకు ఆక్షేపిస్తున్నారు అని చర్చ జరుగుతోంది. పెళ్లిళ్లు చేసుకోవడానికి ఆంక్షలు పెట్టడం విచిత్రంగా ఉందని వారు అంటున్నారు.

Advertisement

Loading

Trending