Connect with us

Andhra Pradesh

యురేనియం తవ్వకాలు వెంటనే ఆపాలని సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. కర్నూలు జిల్లా ప్రజలకు ఊరట

యురేనియం తవ్వకాలు వెంటనే ఆపాలని సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. కర్నూలు జిల్లా ప్రజలకు ఊరట

కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలపై ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. యురేనియం తవ్వకాలు ఆపేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రజల ఆందోళనల దృష్ట్యా తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని .. అలాగే బోర్ల తవ్వకాల ప్రక్రియను కూడా ఆపేయాలని ఆదేశించారు. కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలపై స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. కొద్ది రోజులుగా వారు ఆందోళన చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు తవ్వకాలు ఆపాలని ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్‌‌లో యురేనియం తవ్వకాలకు బ్రేక్ పడింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను ఆపేయాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల ఆందోళనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, యురేనియం కోసం బోర్లు వేయడం ఆపాలని ఆదేశాలిచ్చారు. కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. ఇకపై అక్కడ ఎలాంటి తవ్వకాలు జరగవని చెప్పారు.

యురేనియం తవ్వకాలకు సంబంధించి జిల్లాకు చెందిన మంత్రి టీజీ భరత్, పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. యురేనియం తవ్వకాల గురించి ప్రస్తావించగా, వెంటనే స్పందించిన సీఎం తవ్వకాలను నిలిపివేయాలని ఆదేశించారు. భవిష్యత్తులోనూ కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వకూడదని చెప్పారు. అయితే ఎంఏడీ కోరిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్టేజ్‌-2 అనుమతులు ఇవ్వాల్సి ఉంది.. ముఖ్యమంత్రి తీసుకున్న తాజా నిర్ణయంతో తవ్వకాలకు బ్రేక్‌ పడింది. కప్పట్రాళ్ల ప్రాంతంలో బోర్‌హోల్స్‌ వేయడం నిలిచిపోనుంది.. కర్నూలు జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా కూడా అధికారికంగా ప్రకటించారు. యురేనియం తవ్వకాలు జరగవని.. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని కోరారు.

యురేనియం తవ్వకాలకు కూటమి ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోయినా, కొందరు వైఎస్సార్‌సీపీ నేతలు చంద్రబాబు సర్కార్ అనుమతులు ఇచ్చిందని అబద్ధంగా ప్రచారం చేశారని మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు కోపం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలిసి యురేనియం అంశంపై స్పష్టత తీసుకున్నామని.. వైఎస్సార్‌సీపీ చేసే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. గత ప్రభుత్వం సమయంలోనే యురేనియం డ్రిల్లింగ్‌ మరియు తవ్వకాలకు అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో.. యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న సమీప గ్రామాల ప్రజలకు ఉపశమనం దక్కింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం నెల్లిబండ, బండపల్లి, బంటుపల్లి, బేతపల్లి, కోటకొండ, ఈదుల దేవరబండ, జిల్లేడుబుడకల, కప్పట్రాళ్ల, దుప్పనగుర్తి, చెల్లెల చెలిమెల గ్రామాల ప్రజలు యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేశారు. వీరు యురేనియం వ్యతిరేక పోరాట కమిటీగా ఏర్పడ్డారు. పలు పార్టీలు వారికి మద్దతు ఇచ్చాయి. ప్రభుత్వం యురేనియం తవ్వకాలను ఆపేస్తున్నట్లు ప్రకటించడంతో, ఆ గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

యురేనియం ప్రాజెక్టు వల్ల తమ గ్రామాల్లో నీరు కలుషితమవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భంలో జరిగే బ్లాస్టింగ్‌ కారణంగా.. టెయిలింగ్‌పాండ్‌ వల్ల తెల్లని దుమ్ములాగా వచ్చి పడుతోందని ఆరోపిస్తున్నారు. అలాగే ఈ గ్రామాల్లో ప్రజలకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని.. దురదలకు, దద్దుర్లకు క్రమం తప్పకుండా మందులు వాడాల్సిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు. అందుకే తాము ఈ యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు.

Loading

Trending