Connect with us

Andhra Pradesh

విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్లు..! ఈ రూట్‌లోనే..

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం విస్తరిస్తోంది.. ఈ ప్రాంతం ప్రత్యేకంగా ఫోకస్ పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఒక వైపు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం పనులు జరుగుతుండగా.. ఇంకోవైపు మెట్రో రైలు ప్రాజెక్టుపై అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో నగరంలో జాతీయ రహదారి ఎన్‌హెచ్ 16పై డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్లు (వాహనాలు వెళ్లేందుకు ఓ ఫ్లైఓవర్.. మెట్రో ఫ్లై ఓవర్ ఒకదానిపై ఒకటి ఉంటాయి) ప్లాన్ చేస్తున్నారు. ఇక విశాఖపట్నంలో కొమ్మాది నుంచి గాజువాక దాక నిర్మించే మెట్రో రైలు ప్రాజెక్టు తొలి దశలో ఈ డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్లు ఉండేలా పనులు మొదలు పెట్టారు. అయితే భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పూర్తయ్యేలోగా.. నగరంలో నేషనల్ హైవేపై ప్రతిపాదిత ఫ్లై ఓవర్లను నిర్మించాలనే ప్లాన్ ఉంది.

రెండు రోజుల క్రితం మంత్రి నారాయణ.. విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టు, జాతీయ రహదారిలో ఫ్లైఓవర్ల నిర్మాణంపై.. వీఎంఆర్‌డీఏలో జరిగిన సమావేశంలో చర్చించారు. విశాఖపట్నం మీదుగా నేషనల్ హైవే 16పై ఫ్లై ఓవర్లు నిర్మించాలని జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు చెప్తున్నారు. జులైలో జరిగిన సమీక్షల్లో.. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ ఫ్లై ఓవర్లకు అనుగుణంగా మెట్రో కారిడార్‌ డిజైన్‌ మార్చాలని చెప్పారు. మెట్రో రైలు కారిడార్‌, అటు ఫ్లై ఓవర్ల రెండూ ఒకే అలైన్‌మెంట్‌లో ఉండాలని.. డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌ ఉండాలి అని అన్నారు. రోడ్‌ ఫ్లైఓవర్‌ కమ్‌ మెట్రో కారిడార్‌ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలపై మూడు నెలల్లో నివేదిక తయారు చేయాలని నిర్ణయించారు. తాజాగా ఇదే విషయాన్ని మంత్రి నారాయణ ప్రస్తావించారు.

విశాఖపట్నంలో మెట్రో రైలుతో పాటు వాహనాలు వెళ్లడానికి వీలుగా ఈ డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్లు మొత్తం పది ఉంటాయంటున్నారు. మెట్రో రైలు తొలి దశ కొమ్మాది నుంచి గాజువాక వరకు ప్లాన్ చేశారు.. కాబట్టి కార్‌షెడ్‌ జంక్షన్‌ దగ్గర, ఎండాడ, హనుమంతవాక, మద్దిలపాలెం, సత్యం జంక్షన్, ‌గురుద్వారా, అక్కయ్యపాలెం, తాటిచెట్లపాలెం, ఎన్‌ఏడీ జంక్షన్,‌ గాజువాక, స్టీల్‌ ప్లాంటు దగ్గర ఫ్లై ఓవర్లు నిర్మించాల్సి ఉంటుంది. దువ్వాడ, అలానే లంకెలపాలెంలో కూడా ఫ్లైఓవర్‌ నిర్మించాలనే ప్రతిపాదన ఉన్నా.. అవి మెట్రో కారిడార్‌ పరిధిలో లేకపోవడంతో ప్రస్తుతానికి వాటిని పెండింగ్‌లో పెట్టారు.

విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైలు రాబోతోంది.. దీనికి పూర్తిగా కేంద్రమే నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది. అయితే ఇందులో ఫ్లైఓవర్లు కూడా చేరడంతో వాటికి అదనంగా నిధులు అవసరం అవుతాయని భావిస్తున్నారు. వీటికి కూడా కూడా కేంద్రం సాయం కోరాలని నిర్ణయించారు. ఈ డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ల ప్రాజెక్ట్‌కు సంబంధించి మూడు నెలల్లో (2025 ఫిబ్రవరి) అధ్యయన నివేదికను సిద్ధం చేయాలని భావిస్తున్నారు. విశాఖపట్నం మాత్రమే కాదు విజయవాడలో కూడా డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్లు ప్లాన్ చేస్తున్నారు.

Loading

Advertisement

Trending