Connect with us

Andhra Pradesh

ఏపీలో మద్యం షాపులు నడుపుతున్నవారికి షాక్.. లైసెన్సులు రద్దు చేస్తామని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

ఏపీ సీఎం చంద్రబాబు మద్యం షాపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మద్యం ఎమ్మార్పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువకైనా అమ్మినా వదిలేది లేదని ఆయన హెచ్చరించారు. అమరావతిలోని సచివాలయంలో గనులు, ఎక్సైజ్‌ అధికారులతో చంద్రబాబు సమీక్ష సమావేశం చేశారు. ఈ సమావేశంలో ఇసుక లభ్యత, సరఫరా, మద్యం ధరలపై చర్చించారు. ఎమ్మార్పీ ఉల్లంఘించే లేదా బెల్ట్‌ షాపులకు మద్యం విక్రయించే షాపులకు మొదటి తప్పుగా రూ.5 లక్షల జరిమానా విధించాలని సూచించారు. మళ్లీ అదే తప్పు చేస్తే, ఆ షాపు లైసెన్సు రద్దు చేయాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్ట్‌ షాపుల్ని అనుమతించొద్దని అధికారుల్ని ఆదేశించారు. మద్యం షాపుల యజమానులు బెల్ట్‌ షాపుల్ని ప్రోత్సహించినా.. ఇతర ప్రాంతాల నుంచి మద్యం తెచ్చినా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి మద్యం షాపు దగ్గర సీసీ కెమెరాలు, ధరల వివరాల్ని తెలియజేస్తూ బోర్డులు కచ్చితంగా ఉండాలని తేల్చి చెప్పారు. అలాగే, మద్యం అమ్మకాలు మరియు ఇతర సమస్యలపై ఫిర్యాదులు అందుకోవడానికి ఒక టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని చెప్పారు.

మరోవైపు రాష్ట్రంలో ఇసుక విషయంలో తప్పులు జరిగితే అధికారులపై ముందుగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ముఖ్మమంత్రి. ఇసుక విషయంలో ఉల్లంఘనలకు వారే బాధ్యత వహించాలని తేల్చిచెప్పారు. ఇసుక లభ్యత పెంచాలని, రీచ్‌ల దగ్గరకు సులభంగా వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే పొరుగు రాష్ట్రాలకు ఒక్క లారీ ఇసుక కూడా వెళ్లడానికి వీల్లేదని తేల్చి చెప్పారు.. ఇసుక, మద్యం విధానాల్లో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉంది అన్నారు. ఇది గ్రామ స్థాయి వరకు సరిగ్గా అమలు అవ్వాలని, ప్రజలకి ఇబ్బంది కలిగించేలా ఎవరు పని చేసినా సహించొద్దని చెప్పారు. వీటన్నటికి పర్యవేక్షణకు త్వరలో సెంట్రల్‌ మానిటరింగ్‌ సిస్టం ఏర్పాటు చేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

మరోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ప్రధానంగా కొన్ని రేవుల నుంచి యంత్రాలతో ఇసుక తవ్వి, అక్రమంగా హైదరాబాద్‌కు పంపించడం పై విచారణకు ఆదేశించారు. ఈ విషయం పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ జిల్లా నాయకులపై కోపం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులతో అవగాహన కుదుర్చుకొని వైఎస్సార్‌సీపీ మాజీ నేత ఇసుక తవ్వకాలు చేయడంపై స్పందించారు. వెంటనే విచారణకు ఆదేశించారు.. నందిగామలో తవ్వకాలు జరిపిన ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. అయితే అప్పటికే అక్కడి నుంచి యంత్రాలను తరలించేశారు. ఇసుక తవ్వకాలపై మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ వ్యవహారంతో తన పేరును వాడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఇసుక విషయంలో తాను ఎవరికీ సిఫార్సు చేయలేదని చెప్పారు.

Advertisement

Loading

Trending