Connect with us

Andhra Pradesh

పళ్లు తోముతుండగా బాలుడి దవడలో గుచ్చుకుపోయిన బ్రష్.. అసలు ఏమైందంటే?

శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ బాలుడి దవడలో బ్రష్ గుచ్చుకుంది. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని సైదాపురంలో 11 ఏళ్ల ప్రవీణ్ కుమార్ అనే బాలుడు ఉదయాన్నే లేచి పళ్ళు తోముతున్నాడు.. ఆ సమయంలో బాలుడు కిందపడటంతో బ్రష్‌లోని పదునైన భాగం దవడలోకి చొచ్చుకుపోయింది. బ్రష్ దవడలో అలాగే ఇరుక్కుపోగా.. వెంటనే తల్లిదండ్రుల్ని బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు బాలుడికి ఆపరేషన్ చేసి బ్రష్‌ను తొలగించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.. బాలుడికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.

మరోవైపు గుంతకల్లులో ఆక్సిజన్ అందక బాలుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గుంతకల్లు మండలంలోని తిమ్మాపురానికి చెందిన షఫీ, జాస్మిన్‌ దంపతుల కుమారుడు ఇంతియాజ్‌ అలీకి ఏడాది వయసు. బాాలుడికి తీవ్ర జ్వరం రావంతో గుంతకల్లులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.. అక్కడ పది రోజుల పాటు ట్రీట్మెంట్ అందించారు.

బాలుడు కోలుకోకపోగా.. ఫిట్స్‌ రావడంతో తల్లిదండ్రులు ఆందోళనచెందారు. బాలుడికి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లాలని అక్కడి డాక్టర్ సూచించారు. బుధవారం ఉదయం డాక్టర్ సిఫార్సు చేసిన ప్రైవేట్‌ అంబులెన్స్‌లోనే వెంటిలేటర్‌పై బాలుడ్ని కర్నూలుకు తరలిస్తుండగా ప్యాపిలి దగ్గరకు చేరుకోగానే ఆక్సిజన్‌ అందక చనిపోయాడు. డోన్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షించగా ఆక్సిజన్‌ అందకపోవడంతో బాలుడు ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. నిండు సిలిండర్‌ లేకుండానే, కేవలం 40 శాతం ఆక్సిజన్‌ ఉన్న సిలిండర్‌తో అంబులెన్స్‌ డ్రైవరు బయలుదేరాడని బాలుడి తండ్రి షఫీ ఆరోపించారు.

తమకు న్యాయం చేయాలని బాలుడి మృతదేహంతో ఆసుపత్రి దగ్గరకు వస్తుంటే.. అంబులెన్స్‌ డ్రైవర్‌ మరో నలుగురు స్నేహితులు కలిసి తమను బెదిరించారని బాధితులు ఆరోపించారు. ఆ తర్వాత బాలుడి మృతదేహంతో తల్లిదండ్రులు, వారి బంధవులు గుంతకల్లు ఆసుపత్రి వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక టీడీపీ నేతలు అక్కడికి వెళ్లి బాధిత కుటుంబానికి భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు.. పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.

ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారిణి ఈబీ దేవి గుంకతల్లు ప్రైవేట్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. డాక్టర్, సిబ్బందిని సిలిండర్‌లో ఆక్సిజన్‌ ఎందుకు తక్కువ ఉందని ప్రశ్నించారు. చిన్నారి మృతిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని.. అంబులెన్స్‌ డ్రైవరును ప్రశ్నించామన్నారు. ఈ ఘటనలో అతని నిర్లక్ష్యం ఉందని.. డాక్టర్‌కు షోకాజ్‌ నోటీసు ఇస్తున్నామన్నారు.

Advertisement

Loading

Trending