Connect with us

Sports

IND vs BAN 1st T20i: తొలి టీ20లో బంగ్లాదేశ్‌ చిత్తు..

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను భారత్‌ విజయంతో ఆరంభించింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన మన యువ భారత్.. బంగ్లాదేశ్ జట్టును చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. కనీసం 20 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది. భారత బౌలర్ల దెబ్బకు 19.5 ఓవర్లలోనే 127 పరుగులకు ఆలౌట్ అయ్యి కుప్పకూలింది. ఆ తర్వాత భారత్‌ 3 వికెట్లు కోల్పోయి 11.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు భారత పేసర్‌ అర్షదీప్ సింగ్‌ మొదట్లోనే షాక్‌ ఇచ్చాడు. అతను విసిరిన ఏడు బంతుల్లోనే ఓపెనర్లు ఇద్దరినీ ఔట్‌ చేసేసాడు. ఆ తర్వాత వరుణ్‌ చక్రవర్తి కూడా వికెట్ల వేటను ప్రారంభించాడు. దీంతో బంగ్లాదేశ్‌ బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. ఈ ఒత్తిడిలో వరుసగా వికెట్లు కోల్పోయారు. అయితే చివర్లో మెహిదీ హసన్ మిరాజ్‌ (32 బంతుల్లో 35 రన్స్‌ నాటౌట్‌గా) నిలిచి రాణించడంతో బంగ్లాదేశ్ స్కోరు.. 120 పరుగులను దాటింది. చివరకు 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక భారత బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌ 3, వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీయగా.. మయాంక్ యాదవ్‌, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్‌ తలా ఓ వికెట్‌ తీశారు.

ఆ తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాటర్లు ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఎప్పుడెప్పుడు మ్యాచ్‌ ముగిద్దామా అన్నట్లు ఆడేశారు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అభిషేక్ శర్మ (7 బంతుల్లోనే 16 రన్స్‌), సంజూ శాంసన్ (19 బంతుల్లోనే 29 రన్స్‌), సూర్యకుమార్ యాదవ్‌ (14 బంతుల్లోనే 29 రన్స్‌) వేగంగా పరుగులు చేసారు. చివర్లో హార్దిక్ పాండ్యా (16 బంతుల్లోనే 39 రన్స్‌), అరంగేట్ర ప్లేయర్‌ నితీశ్‌ రెడ్డి (15 బంతుల్లో 16 రన్స్‌) తో పూర్తి చేశారు. దీంతో భారత్‌ మరో 49 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

సిరీస్‌లో భాగంగా రెండో టీ20 మ్యాచ్‌ అక్టోబర్‌ 9న జరగనుంది. ఢిల్లీ వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. మూడో టీ20 మ్యాచ్‌ అక్టోబర్‌ 12న హైదరాబాద్‌లో జరుగుతుంది.

Loading

Advertisement

Trending