Connect with us

Andhra Pradesh

అర్ధరాత్రి ప్రేమోన్మాది వీరంగం.. బాలిక కుటుంబపై కత్తితో దాడి

బాప‌ట్ల జిల్లా చెరుకుప‌ల్లి మండ‌లంలోని ఓ గ్రామంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఆ మండ‌లంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక గతంలో జడ్పీ ఉన్న‌త పాఠ‌శాల‌లో చదివింది. ఆ స‌మ‌యంలో అదే మండ‌లంలోని రాజోలు పంచాయ‌తీ ప‌రిధి రెడ్ల‌పాలేనికి చెందిన కుంచాల భార్గ‌వ్ రెడ్డి.. త‌న‌ను ప్రేమించాలంటూ ఆమె వెంటపడుతూ ఉండేవాడు. ఆమెను ప్రేమ‌ పేరుతో వేధింపుల‌కు గురిచేస్తుండేవాడు.

ఈ విష‌యం తెలుసుకున్న బాలిక త‌ల్లిదండ్రులు ఆమెను చ‌దువు మాన్పించేసి.. బాలికను ఇంటి వ‌ద్దే ఉంచేశారు. అయితే ఒకవైపు తన కుమార్తెకు పెళ్లి చేయాల‌ని బాలిక తండ్రి కొంత‌కాలంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఈ విష‌యం తెలిసిన భార్గ‌వ్ రెడ్డి.. త‌న‌కు ద‌క్క‌ని బాలిక‌.. వేరెవ్వ‌రికీ ద‌క్క‌కూడ‌ద‌ని అనుకున్నాడు. ఆదివారం అర్థ‌రాత్రి భార్గ‌వ్ రెడ్డి త‌న స్నేహితుడు అయినా విజ‌య‌భాస్క‌ర్ రెడ్డితో కలిసి ఆ బాలిక ఇంటికి వెళ్లాడు.

అయితే వారు వచ్చిన చ‌ప్పుడు విని నిద్ర లేచిన బాలిక త‌ల్లిదండ్రులు.. ఎవరని ప్ర‌శ్నించారు. అంత‌లోనే వెంట తెచ్చుకున్న క‌త్తి, సుత్తితో బాలిక త‌ల్లిదండ్రుల‌పై భార్గవ్ రెడ్డి దాడి చేశాడు. బాలిక తండ్రి ఛాతీ, వీపుపై క‌త్తితో పొడిచాడు. అడ్డుకోబోయిన అత‌డి భార్య‌, కుమార్తెపై కూడా దాడి చేశాడు. వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరి అరుపులు, కేకలు విని ఇరుగుపొరుగు వారు నిద్ర లేచి ప‌రుగెత్తుకొచ్చారు. వారి రాక‌ను గ‌మనించిన నిందితుడు.. స్నేహితుడితో క‌లిసి పరార‌య్యాడు.

తీవ్ర గాయాలు పాలైన ఆ కుటుంబ స‌భ్యుల‌ను రేప‌ల్లె ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. ఇక బాధితుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని SI అనిల్‌కుమార్ అన్నారు. ప‌రారీలో ఉన్న నిందితులను ప‌ట్టుకుంటామ‌ని అన్నారు. అయితే.. ఈ సంఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వడానికి పోలీస్ స్టేష‌న్‌కు ఫోన్ చేస్తే అక్కడ ఎవ‌రూ స్పందించ‌లేదని ఆ గ్రామస్తులు చెపుతున్నారు. నేరుగా SI కె ఫోన్ చేశామని, ఆయ‌న కూడా స్పందించ‌లేద‌ని వాళ్ళు అంటున్నారు.

బాధిత కుటుంబానికి న్యాయం చేయాల‌ని కోరుతూ.. సోమ‌వారం సాయంత్రం గ్రామ‌స్థులు జాతీయ ర‌హ‌దారిపై బైఠాయించారు. రాస్తారోకో చేప‌ట్టి, వాహ‌నాల రాక‌పోక‌ల‌ను అడ్డుకున్నారు. త‌హ‌సీల్దార్ ప‌ద్మావ‌తి, రేప‌ల్లె రూర‌ల్ సీఐ సురేష్ బాబు అక్క‌డికి వచ్చి.. 24 గంట‌ల్లో నిందితుల‌ను అరెస్టు చేసి వారికి శిక్ష ప‌డేలా చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

బాధిత కుటుంబాన్ని రేప‌ల్లె ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో మ‌హిళా సంఘం (ఐద్వా), ఎస్ఎఫ్ఐ, సీపీఎం నేత‌లు ప‌రామ‌ర్శించారు. నిందితుల‌ను వెంట‌నే శిక్షించాల‌ని హాస్పిటల్ వ‌ద్ద నాయ‌కులు ధర్నా చేసారు. నిందితుడిని 24 గంట‌ల‌ల్లో అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేశారు. దోషుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని డీఎస్పీని కోరారు.

Loading

Trending