Connect with us

Telangana

తెలంగాణ రైతులకు మంచి వార్త.. ఈ రోజు అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి, చెక్ చేసుకోండి!

తెలంగాణ ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రూ. 2 లక్షల రైతు రుణాలు మాఫీ చేయగా, నేడో రేపో రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయం అందించడానికి సిద్ధం అయ్యారు. ఇప్పటికే విధివిధానాలు రూపొందించే పనిలో నిమగ్నమైంది. రాష్ట్రంలో సన్నాల సాగును ప్రోత్సహించేందుకు బోనస్‌ ప్రకటించినట్లు తెలిసింది. సన్న వరి ప్రతి క్వింటాకు రూ.500 ఇస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా దొడ్డు వడ్లకు, సన్నాలకు వేర్వేరు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఈ సీజన్‌లో అన్నదాతలు పెద్ద ఎత్తున సాగు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దొడ్డు రకం వడ్లు 23,58,344 ఎకరాల్లో సాగించారు. సన్నాలు 36,80,425 ఎకరాల్లో సాగించారు. సన్న వరి ధాన్యం 48.91 లక్షల టన్నులు, దొడ్డు రకం ధాన్యం 42.37 లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలకు రాబోతున్నట్లు అధికారులు అంటున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో చాలా సన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తోంది.

కానీ సన్న వరి ధాన్యం అమ్మిన రైతులు రూ.500 బోనస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ డబ్బులు రైతులకు చెల్లించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. వరి ధాన్యం బోనస్‌ డబ్బులు నేడు లేదా రేపటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రతి క్వింటాకు రూ.500 చొప్పున మెుత్తం 48.91 లక్షల టన్నులకు రూ.2,445 కోట్ల బోనస్‌ డబ్బులు రైతులకు చెల్లించాలని వ్యవసాయశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం వరికి మద్దతు ధర ఇస్తోంది.గ్రేడ్‌ A రకానికి 2,320 రూపాయలు, సాధారణ రకానికి 2,300 రూపాయలు చెల్లిస్తున్నారు. అయితే రైతులకు చెల్లించే రూ. 500 బోనస్‌ను రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మొదటి విడతగా బోనస్ చెల్లించడానికి రూ. 1,000 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన అన్నదాతలందరికీ తొలుత మద్దతు ధర చెల్లించనున్నారు. తర్వాత సన్నాల బోనస్‌ డబ్బులు కూడా చెల్లింపులు చేస్తారు. ఆర్థికశాఖ, ఈ-కుబేర్ ద్వారా రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బు జమ చేయనుంది.

Advertisement

Loading

Trending