Business
మీషో షేర్ల జోరు : తొలిసారి రూ.85 వేల కోట్ల మార్కెట్ క్యాప్ దాటింది
స్టాక్ మార్కెట్లో మిడ్క్యాప్ విభాగానికి చెందిన ఈ-కామర్స్ సంస్థ మీషో లిమిటెడ్ షేర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. లిస్టింగ్ తర్వాత నుంచి ఆగకుండా దూసుకెళ్తున్న ఈ స్టాక్ ఒక్కరోజులోనే 13 శాతానికి పైగా పెరిగి కొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. వారం వ్యవధిలోనే డబుల్ డిజిట్ రిటర్న్స్ ఇవ్వడంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారిగా రూ. 85 వేల కోట్ల మార్కును దాటింది.
ఈ నెలలోనే ఐపీఓ ద్వారా మార్కెట్లోకి వచ్చిన మీషో, లిస్టింగ్ రోజే సుమారు 55 శాతం ప్రీమియంతో ట్రేడింగ్ ప్రారంభించి ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అందించింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్టైన కొద్ది రోజుల్లోనే ఈ స్టాక్ మిడ్క్యాప్ సెగ్మెంట్లో హాట్ టాపిక్గా మారింది.
క్రితం ట్రేడింగ్ సెషన్లో మీషో షేరు 5.7 శాతం లాభంతో రూ. 180.50 వద్ద ముగిసింది. తాజా ట్రేడింగ్లో మరింత ఉత్సాహం చూపిన ఈ షేరు సుమారు 10 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ దిశగా కదిలింది. ఇంట్రాడేలో రూ. 186.55 వద్ద ప్రారంభమై కొద్దిసేపటికే రూ. 199.49 స్థాయిని తాకింది. ఇదే ఈ స్టాక్కు 52 వారాల గరిష్ఠ ధరగా నమోదైంది. వార్త రాసే సమయానికి షేరు సుమారు 9 శాతం లాభంతో రూ. 197 ప్రాంతంలో ట్రేడవుతోంది.
ఈ షేర్కు సంబంధించిన 52 వారాల కనిష్ఠ ధర రూ. 153.89 కాగా, గత వారం రోజుల్లోనే దాదాపు 15 శాతం వరకు లాభం అందించడం విశేషం. ప్రస్తుతం మీషో లిమిటెడ్ మార్కెట్ విలువ సుమారు రూ. 89,000 కోట్లకు పైగా చేరినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
మీషో లిమిటెడ్ దేశంలో ప్రముఖ వ్యాల్యూ ఆధారిత ఈ-కామర్స్ మార్కెట్ప్లేస్గా గుర్తింపు పొందింది. సోషల్ మీడియా మరియు డిజిటల్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి లక్షలాది చిన్న వ్యాపారులు, ఎంటర్ప్రెన్యూర్స్ను నేరుగా వినియోగదారులతో కలిపే విధానమే ఈ సంస్థ బలంగా నిలుస్తోంది. ఫ్యాషన్, హోమ్ అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్స్ వంటి అనేక విభాగాల్లో తక్కువ ధరలకు ఉత్పత్తులను అందిస్తోంది.
ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థను డిసెంబర్ 2015లో ప్రారంభించారు. తాజా స్టాక్ ప్రదర్శనతో మీషో భవిష్యత్ వృద్ధిపై మార్కెట్లో ఆశావహ అంచనాలు పెరుగుతున్నాయి.
#MeeshoShares#MeeshoIPO#StockMarketIndia#MidCapStocks#EcommerceStocks#MarketRally#52WeekHigh
#IPOListingGains#IndianStocks#ShareMarketNews#InvestorBuzz#DigitalCommerce
![]()
