National

దక్షిణాదిన హిందీ వివాదం వేళ.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు

దక్షిణాదిలో మళ్లీ హిందీ భాష వివాదం చెలరేగింది. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా హిందీని రుద్దుతోందంటూ దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న తరుణంలో, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బెంగళూరులో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ (రాజ్యోత్సవ) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కేంద్ర ప్రభుత్వం కర్ణాటక పట్ల సవతి తల్లి వైఖరిని ప్రదర్శిస్తోందని తీవ్రంగా విమర్శించారు.

సిద్ధరామయ్య మాట్లాడుతూ – “కర్ణాటక రాష్ట్రం దేశ ఖజానాకు రూ.4.5 లక్షల కోట్ల ఆదాయం అందిస్తోంది. కానీ మనకు రావాల్సిన న్యాయమైన వాటాను ఇవ్వడంలో కేంద్రం నిర్లక్ష్యం చూపుతోంది. కేవలం స్వల్ప మొత్తంలోనే నిధులు మళ్లిస్తోంది. ఇది కర్ణాటక ప్రజల పట్ల అన్యాయం” అని మండిపడ్డారు.

అదే సమయంలో ఆయన హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. “కన్నడకు అన్యాయం జరుగుతోంది. హిందీ, సంస్కృత భాషలకు గ్రాంట్లు ఇస్తూ, క్లాసికల్ హోదా ఉన్న కన్నడ భాషకు నిధులు నిరాకరించడం విచారకరం” అని అన్నారు.

సిద్ధరామయ్య, కర్ణాటక ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ – “కన్నడను వ్యతిరేకించే వారందరినీ రాష్ట్ర ప్రజలు తప్పక నిరసించాలి. మన భాష, మన సంస్కృతిని కాపాడుకోవాలి” అని పిలుపునిచ్చారు.

విద్యా రంగంలో మాతృభాష ప్రాముఖ్యతపై కూడా ఆయన దృష్టి సారించారు. “అభివృద్ధి చెందిన దేశాల్లో పిల్లలు తమ మాతృభాషలోనే ఆలోచించి, కలలు కంటారు. కానీ మన దేశంలో మాత్రం ఇంగ్లీష్, హిందీ భాషల ఆధిపత్యం కారణంగా పిల్లల సహజ ప్రతిభ దెబ్బతింటోంది. దీనిని అధిగమించడానికి కేంద్రం తక్షణమే మాతృభాషను బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టే చట్టం తీసుకురావాలి” అని డిమాండ్‌ చేశారు.

“కన్నడ భాష, సంస్కృతిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాల్సిన సమయం ఇది. మన భాష మన గౌరవం, దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత” అని సీఎం సిద్ధరామయ్య నొక్కి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version